కిషన్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

26 Mar, 2022 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను అవమానించిన వారు ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదు. పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది. కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోంది. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అని కన్ఫ్యూజ్‌ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుంది. మేము వడ్లు ఇస్తం.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టం. తెలంగాణ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కిషన్‌ రెడ్డి ఏం చేస్తున్నారు..?. ఆయనకు రైతుల కష్టాలు పట్టవా. మేము ఇన్నిసార్లు పీయూష్‌ గోయల్‌ను కలిస్తే ఒక్కసారి అయినా కిషన్‌రెడ్డి వచ్చాడా..?.

కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్‌ ప్రొడక్షన్‌ 2025 నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు. గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం... ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెందుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని' మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.  

చదవండి: (ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు)

మరిన్ని వార్తలు