సరుకు రవాణా మరింత పెరగాలి

25 Sep, 2021 03:46 IST|Sakshi
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రైల్వే మంత్రి 

రైల్వే సహాయమంత్రి పాటిల్‌ దాన్వే 

సాక్షి, హైదరాబాద్‌: రైల్వేలో టికెట్‌యేతర ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్‌ పాటిల్‌ దాన్వే ఆదేశించారు. సరుకు రవాణాను మరింత పెంచేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా చేసే సంస్థలతో లాజిస్టిక్స్‌ కంపెనీలతో మెరుగైన అనుసంధానం ఉండేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే ముందు వరుసలో ఉండాల్సి ఉందని, ఇందుకు సరుకు రవాణా మరింత పటిష్టం కావాల్సిన అవసరముందని చెప్పారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. సీసీటీవీ నెట్‌వర్క్, భద్రత, కిసాన్‌ రైళ్లు, దూద్‌ దురంతో అంశాలను కూలంకషంగా చర్చించారు. కరోనా సమయంలో రైల్వే ఆస్పత్రి అందించిన సేవలను పాటిల్‌ ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు