సాక్షి, హైదరాబాద్: ‘మనం ఎక్కడ ఉన్నా మూలాలను మాత్రం మరవొద్దు’అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలుగువారందరినీ ఒకేచోట చూడటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏనిమిదేళ్లలో అనేక అద్భుతాలు సృష్టించిందని కొనియాడారు.