టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూల్చివేత

17 Sep, 2020 14:17 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు చెందిన హన్మకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు బుధవారం కూల్చివేశారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగగా నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలే కారణమని గుర్తించారు. ఇందులో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం కూడా ఉన్నట్లు ఇటీవల తేల్చారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశాలతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్మాణాన్ని పాక్షికంగా తొలగించారు. కాగా, నాలా విస్తరణ కోసం కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కాగా వరంగల్‌లో వరదల సంభవించిన సమయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. (నాలాల ఆక్రమణపై కేటీఆర్‌ సీరియస్‌) 

నాలాలపై కొనసాగుతున్న కూల్చివేత
వరంగల్‌ నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహారీల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్‌ నాలాలపై ఉన్న 22 ఆక్రమణలను బల్దియా సిబ్బంది తొలగించారు. ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చివేసినట్లు ఏసీపీలు ప్రకాశ్‌ రెడ్డి, సాంబయ్య తెలిపారు. (ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ!)

మరిన్ని వార్తలు