జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా: చెన్నమనేని

22 Jun, 2021 17:19 IST|Sakshi

హైదరాబాద్‌: పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు.

చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!

మరిన్ని వార్తలు