టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

31 Jan, 2021 17:30 IST|Sakshi

రామమందిరానికి చందాలు ఎందుకు : ధర్మారెడ్డి

సాక్షి, వరంగల్‌ : రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దేవుని పేరుతో అకౌంట్ బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి రామాలయంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందన్నారు. రాముడిగుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదన్నారు. రాముడు అందరి వాడు హిందువైనా ప్రతి వారు రాముని పూజిస్తారని, రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా అని అన్నారు. బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే అన్నారు. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో 29వేలకోట్లు ఏం చేస్తారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేస్తుందని వరంగల్ ఎంపీ దయాకర్ అన్నారు. ఖాజీపేటలో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటుకు, వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట లో టెక్స్ టైల్స్ పరిశ్రమకు నిధులు కేటాయించేందుకు కేంద్రంపై వత్తడి చేస్తామని స్పష్టం చేశారు.

ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి..
మరోవైపు ధర్మారెడ్డి వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడిచేసిన నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ కార్యకర్తుల చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు