నువ్వు ఏం చేస్తవ్‌ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రతాపం

11 Apr, 2023 16:37 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌:  నిర్మల్  జిల్లాలో ‌ డబుల్  బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల  ఎంపిక కోసం  మంగళవారం ఖన్నపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.  ఈ సమావేశంలో నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, గ్రామ సర్పంచ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ మాట్లాడుతూ.. వేదిపై ఉన్న వారి పేర్లు చెబుతూ సర్పంచ్‌ పేరు పలకడం మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్‌ నరేందర్‌ రెడ్డి తన పేరు ప్రస్తావించలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. సర్పంచ్‌ పేరు చెప్పకుండా ప్రోటోకాల్‌న ఉల్లంఘించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సర్పంచ్‌ సీరియస్‌గా స్పందించారు. రేపు నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు బయపడని సర్పంచ్‌.. మీరు నన్నేం చేస్తారు మేడం, ఏం చేస్తారో చేసుకోండని అని బదులిచ్చారు.

దీంతో సర్పంచ్‌పై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించారు. నువ్వు నన్నేం చేస్తావ్‌?. ఎస్టీ మహిళ అని మాట్లాడుతున్నావా.  ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను తీసుకొస్తే.. ఇది నా ఊరు అని ఎలా అంటావ్‌. మా పార్టీ తరపునే మీ ఊరు డెవలప్‌ అవుతుంది. మా పార్టీ వల్లే రోడ్లు, ఇళ్లు వచ్చాయి’ అని సర్పంచ్‌పై  విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్పంచర్‌ నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన పేరు పలకలేదని అడిగినందుకు  ఎమ్మెల్యే దుర్బాషాలాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పినందుకు బెదిరించారని  ఆవేదన వ్యక్తం  చేశారు. ప్రతి పక్షాల సర్పంచ్‌లపై  రేఖనాయక్ చిన్న చూపు చూస్తుందనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.

మరిన్ని వార్తలు