కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న తొలి ఎమ్మెల్యే

25 Jan, 2021 12:36 IST|Sakshi

జగిత్యాల‌: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నారు. రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా టీకాలు వేసుకోనున్నారు. అయితే సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు అత్యంత జాగ్రత్తతో టీకా వేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్‌ వారియర్స్‌ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని ఈ సందర్భంగా డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5 వేల ప్రైవేటు దవాఖానల్లో టీకా పంపిణీ మొదలైంది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. రెండో దశలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా టీకా తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు