పడవలో వెళ్లి.. దుప్పట్లు మోసి.. 

26 Aug, 2020 01:32 IST|Sakshi
దుప్పట్లను మోసుకెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క  

ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క  

సాక్షి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ముంపు బాధితులకు చేయూత అందించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లిన ఎమ్మెల్యే.. స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సీతక్క పేదలపై తనకున్న మమకారాన్ని మరోసారి చాటిచెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, ఓడవాడ, ఆచార్య నగర్, నందమూరి నగర్‌ తదితర ప్రాంతాలు ఇటీవల వరద ముంపునకు గురయ్యాయి.

ఈ మేరకు రాబిన్‌ ఉడ్‌ ఆర్మీ బాధ్యులు రమ – దామోదర్‌ ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల్లో బాధితులకు మంగళవారం చీరలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీతక్క.. ఎలిశెట్టిపల్లికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్గం లేకపోవడంతో పడవపై జంపన్న వాగు దాటారు. అక్కడ దిగాక కొద్దిదూరం నడవాల్సి ఉండటంతో ఇతరులతో కలసి సీతక్క స్వయంగా దుప్పట్లను మోశారు. అనంతరం బాధితులకు సరుకులు పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.  

మరిన్ని వార్తలు