గవర్నర్‌పై కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు

27 Jan, 2023 13:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింత పెరిగింది.  రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా గవర్నర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. 

కాగా, కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డిపై కాషాయ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, ఎమ్మెల్సీపై సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ తమిళిసైపై వ్యాఖ్యలకు గానూ కౌశిక్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కార్పొరేటర్‌ శ్రీవాణి కోరారు. 

ఇక, రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన‌ బిల్లుల ఫైళ్లను గవర్నర్ ఎందుకు దాచుకున్నారంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు. ఇది రాజ్యాంగమా అంటూ నిలదీశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నిలదీస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు