భర్తకు కరోనా.. టీకా వేసుకున్న కవిత, ఎంపీ, మంత్రి కూడా

29 Mar, 2021 14:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా టీకా పొందారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి సోమవారం చేరుకుని కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ‘వ్యాక్సిన్‌ తీసుకోవడంలో అపోహాలు వద్దు. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అందరూ జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి’ అని పిలుపునిస్తూ టీకా తీసుకుంటున్న ఫొటోను కవిత సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు పాజిటివ్‌ తేలిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఆమెతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కూడా కరోనా టీకా వేయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌, ఆయన భార్య కూడా నిమ్స్‌ ఆస్పత్రిలో టీకా పొందారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడకం, మాస్క్‌ ధరించడం చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా కొత్తగా శాసనమండలికి ఎన్నికైన పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవికి పాజిటివ్‌ తేలిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు