ఇన్‌స్పెక్టర్‌కు రౌడీషీటర్‌ దమ్కీ..  

3 Jun, 2021 11:43 IST|Sakshi
ఆసిఫ్‌ ఇక్బాల్‌

వైరల్‌గా మారిన సంభాషణ

సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వహణలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను వాట్సాప్‌ కాల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌పై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన ఆసిఫ్‌ ఇక్బాల్‌ రెండు రోజుల క్రితం మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ను దూషిస్తూ హెచ్చరించారు.

మొఘల్‌పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్‌ పార్టీ కార్పొరేటర్‌తో పాటు రౌడీషీటర్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ ఫోన్‌లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్‌ ఇక్బాల్‌గా రౌడీషీటర్‌ అని గుర్తించారు.  ఇతనిపై ఇప్పటికే రెయిన్‌బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్‌ ఇక్బాల్‌ యెమెన్‌ దేశంలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.

చదవండి: కరోనాతో గాంధీ భవన్‌ అటెండర్‌ షబ్బీర్‌ మృతి 
నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు?

మరిన్ని వార్తలు