ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం

31 Jul, 2021 01:24 IST|Sakshi
అనాథలైన ఇద్దరు పిల్లలు

ఉద్యోగార్థుల నుంచి డబ్బు వసూలు చేసి పైరవీకారులకు అప్పగింత

ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులివ్వాలంటూ బాధితుల ఒత్తిడి

ఒత్తిడి తట్టుకోలేక భార్యాభర్తల బలవన్మరణం

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల పట్టణంలో ఘటన

పరకాల: ఉద్యోగాల కోసం చేసిన మధ్య వర్తిత్వం భార్యాభర్తలను బలి తీసుకుంది. ఓవైపు బాధితుల ఒత్తిడి.. మరోవైపు డబ్బు తీసుకున్న వారి బెదిరింపులకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయారు. 4 రోజుల కింద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీవీడియో తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కు చెందిన తాళ్లపల్లి కేశవస్వామి(53) పెస్టిసైడ్స్‌ కంపెనీలో పనిచేసేవాడు. సినీపరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివసి స్తున్నాడు. వీరికి కుమారుడు నిఖిల్, కుమార్తె చందనప్రియ. నిఖిల్‌ మానసిక వికలాంగుడు.

ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన విద్యుత్‌ శాఖ రిటైర్డ్‌ ఉద్యోగి పుల్లాబాయ్‌తో పాటు వాల్‌ నాయక్, గాడిపల్లి వెంకటేశ్‌లు కేశవస్వామికి పరిచయమయ్యారు. సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరు ద్యోగులు ఉంటే తెలపాలని కేశవస్వామికి చెప్పడంతో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి వారి చేతుల్లో పెట్టాడు. డబ్బు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో కేశవస్వామి పలు మార్లు పుల్లాబాయ్, వాల్‌నాయక్, వెంక టేశ్‌ను డబ్బులివ్వాలంటూ కోరినా తిరిగి బెదిరిం పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులను నచ్చజెప్పలేక.. బెదిరింపులను తట్టుకోలేక కేశవస్వామి కుమిలిపోతున్నాడు. 

మకాం మార్చినా ఆగని వేధింపులు
బాధితుల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చనిపోదామనుకుని హన్మకొండలో అద్దెకు ఉంటున్న గదిలో భార్య, పిల్లలతో కలసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని వరం గల్‌ పోలీస్‌ కమిషనర్‌కు, మిత్రులకు పం పాడు. గురువారం స్థానిక బంగారం దుకా ణంలో కొంత బంగారాన్ని తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో పురుగుల మందు కొని చర్చిలో ప్రార్థనలు చేశారు. భార్యాపిల్లలను అక్కడే ఉంచి కేశవస్వామి బయటకు వెళ్లాడు. అయితే సంధ్యారాణి (50) రాత్రి 10 గంటల సమయంలో బ్యాగులో ఉన్న పురుగుల మందు తాగడంతో స్థానికులు పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించి కేశవస్వామికి సమాచారం ఇచ్చారు. అతడు ఆస్పత్రి చేరుకునేలోపే ఆమె మృతి చెందడంతో కేశవస్వామి కూడా అక్కడే మిగిలిన మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని 108 వాహనం ద్వారా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కాగా, మరో సూసైడ్‌ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కేశవస్వామి ,  సంధ్యారాణి(ఫైల్‌) 

పాకాలలో చనిపోదామనుకున్నారా?
4 రోజుల కింద వీరంతా పాకాలకు వెళ్లినట్లు సమాచారం. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తాగుదామనుకున్నా.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. కాగా, సంధ్యారాణి పురుగుల మందు తాగిన సమయంలో పిల్లలు అక్కడే ఉన్నారు. వారు మానసికంగా సరిగా లేకపోవడం, ఏది తాగాలో తెలియక ఉండిపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు