కేసీఆర్‌.. చేతకాకుంటే రాజీనామా చెయ్‌...

30 Nov, 2021 03:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి వడ్లను కొనబోమని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం దారుణమని, వడ్లు కొనడం చేతకాకుంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేంద్రంపై నెపం నెట్టి రైతాంగాన్ని కాపాడే బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్రం కొనకపోతే రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

రాష్ట్ర రైతాంగం పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ రేపు ఢిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర దీక్ష చేస్తే తాను మద్దతిచ్చి పాల్గొంటానని వెంకట్‌రెడ్డి చెప్పారు. చావు నోట్లో తల పెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్‌.. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే పోరాటమని, ఉత్తరాది రైతుల్లా పోరాటం చేయాలని కోరారు. ఓవైపు తెలంగాణ రైతులు రోడ్లపై పడే పరిస్థితుల్లో ఉంటే.. పక్కరాష్ట్రాల్లో భూములు కొంటున్నారని అనడం కేసీఆర్‌ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. 
 

మరిన్ని వార్తలు