జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు వస్తారా? 

8 Mar, 2021 08:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఈనెల 8వ తేదీ నుంచి పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన హామీలను డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం. మీరు సిద్ధమా?’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌కు రేవంత్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల శరీరాలే వేరని, ఆత్మలు ఒక్కటే అన్నది వాస్తవమని, కాదని చెప్పదల్చుకుంటే తన సవాల్‌కు స్పష్టంగా స్పందించాలని ఆ లేఖలో రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

ఐటీఐఆర్‌తో పాటు రాష్ట్ర విభజన హామీలను సాధించుకునేందుకు సిద్ధమైతే తన సవాల్‌ను స్వీకరించాలని, అలా కాకుండా తన దొడ్లోని కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా మీ ప్రకటనల హడావుడి, ఆర్భాటపు మాటలు వింటుంటే నవ్వొస్తోంది. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీపై యుద్ధమే అని ఇప్పుడు మీరు నిద్రలేచి కాలుదువ్వుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడి యువత భవిష్యత్‌ ముఖ్యమైతే ధర్నాకు రండి. ఢిల్లీలో నిరవధిక దీక్ష చేద్దాం. లేదంటే మీరు మోదీకి తొత్తుగా, తెలంగాణ ద్రోహిగా ప్రజల దృష్టిలో శాశ్వతంగా మిగిలిపోతారు’ అని ఆ లేఖలో రేవంత్‌ ప్రస్తావించారు.
చదవండి:
ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..
విజిలెన్స్‌ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది

 

మరిన్ని వార్తలు