శిశువును కాపాడే ప్రయత్నం చేసినా దక్కని ఫలితం
సర్పంచ్, జీపీ సిబ్బంది ఆధ్వర్యంలో అంత్యక్రియలు
మరిపెడ రూరల్: కరోనా సోకిన 8 నెలల గర్భిణి మృతి చెందిగా.. ఆమె కడుపులోని శిశువును కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లతండాలో చోటు చేసుకుంది. సోమ్లతండా జీపీకి చెందిన భూక్య శిల్ప (27)కు రెండేళ్ల కిందట భూక్య వీరుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈనెల 8వ తేదీన శిల్పకు కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు.
కొన్ని రోజులకు కోవిడ్ లక్షణాలు ఎక్కువయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఈనెల 12న కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ఊపిరాడక ఆదివారం మృతిచెందింది. వెంటన వైద్యులు సిజేరియన్ చేసి ఆమె కడుపులోని బిడ్డను బయటకు తీసినా అప్పటికే మృతి చెందింది. దీంతో తల్లీ బిడ్డల మృతదేహాలను భర్త, ఇతర సభ్యులు ఆస్పత్రి నుంచి గ్రామానికి తీసుకెళ్లారు. స్థానిక సర్పంచ్ భూక్యా కృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.