మునా‘వార్‌’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్‌ ఫారూఖీ

20 Aug, 2022 10:22 IST|Sakshi

గచ్చిబౌలి/అబిడ్స్‌: స్టాండ్‌ అప్‌ కమిడియన్, లాక్‌ అప్‌ షో విజేత మునావర్‌ ఫారూఖీ లైవ్‌ షోకి సైబరాబాద్‌లోని శిల్పకళా వేదిక ముస్తాబవుతుండగా..ఆయనను అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రటించడంతో నగరంలో వాతావరణం హీటెక్కింది. శనివారం లైవ్‌ షో ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందస్తు అరెస్టు చేశారు.

ఆయన్ను తొలుత లాలాపేట, ఆపై బొల్లారం ఠాణాలకు తరలించారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ‘డోంగ్రీ టు నౌహియర్‌’ పేరితో మునావర్‌ షో ఇస్తున్నారు. మునావర్‌ రాకను, ఈ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజాసింగ్‌ కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనపై దాడులు చేస్తామని గతంలో ప్రకటించారు.

తాజాగా  పోలీసులు కూడా ఈ షోకు అనుమతి ఇచ్చిన విషయం తెలుసుకున్న ఆయన మునావర్‌తో పాటు ఆయన షో నిర్వహించనున్న వేదికనూ ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫారూఖీ లైవ్‌ షోను అడ్డుకోవడంతో పాటు వేదికను తగులబెడతామని చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. శిల్పకళా వేదికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్‌ సిటీ చుట్టుపక్కల మార్గాల్లోనూ సిబ్బందిని మోహరిస్తున్నారు.  

అనుమతి ఉంది..భద్రత కల్పిస్తాం 
ఈ షో కు అనుమతి ఉందని, అవసరమైన భద్రత, బందోబస్తు కల్పిస్తామని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ తెలిపారు. శిల్పకళా వేదిక, మాదాపూర్‌ పరిసరాలలో మాదాపూర్‌ పోలీసులు శనివారం ఉదయం నుంచి బందోబస్తు  ఏర్పాటు చేయనున్నారు. ఈ లైవ్‌ షోకు  రెండు వేల మంది వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. టికెట్‌తో వచ్చే ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు.

అనుమానితులు కనిపిస్తే ముందస్తు అరెస్ట్‌లు తప్పవని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మునావర్‌ ఫారూఖీ షోకు సంబంధించిన ఎంట్రీ టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. షో ఎక్కడ అనే అంశాన్ని ఆ వెబ్‌సైట్‌ శుక్రవారం రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకటించలేదు. మునావర్‌ తన ఇన్‌స్టా్రగామ్‌లో డోంగ్రీ టు నో హియర్‌ పేరుతో లైవ్‌ షో ఉందని ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు.

రాజాసింగ్‌ అరెస్ట్‌..ఉద్రిక్తత 
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధూల్‌పేటలోని రాజాసింగ్‌ ఇంట్టి వద్ద ఉదయం నుంచే మోహరించిన పోలీసులు..సాయంత్రం అరెస్ట్‌ చేసి లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర వాగి్వవాదం జరిగింది. ముందుగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తున్నామని ఇంట్టి వద్ద ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలీసుల తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏసీపీ సతీ‹Ùకుమార్‌ ఆధ్వర్యంలో మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, ఇతర సిబ్బంది సాయంత్రం సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయడంతో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్‌ చేస్తారని, పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని తొలగించి రాజాసింగ్‌ను తీసుకువెళ్లారు. అరెస్టుపై ఏసీపీ సతీ‹Ùకుమార్‌ను వివరణ కోరగా ముందు జాగ్రత్త చర్యగానే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశామని తెలిపారు.   

(చదవండి: కార్పొరేట్‌ కాలేజీల వేధింపులతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్న విద్యార్థులు )

మరిన్ని వార్తలు