రాజగోపాల్‌ రెడ్డికి వింత అనుభవం.. అంకుల్‌!.. ఎన్నికల ఖర్చుకిది ఉంచండి!

16 Oct, 2022 16:58 IST|Sakshi

సాక్షి, నల్గొం‍డ: మునుగోడు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. రాజగోపాల్‌రెడ్డి సంస్థాన్‌ నారా యణపురం మండలం చిమిర్యాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన దండుగుల నాగే­ష్‌ కుమారుడు రామ్‌తేజ్‌ (12) తాను దాచుకున్న రూ. 2,450 ఎన్నికల ఖర్చుల కోసం రాజగోపాల్‌కు అందజేశాడు. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ డబ్బు తీసుకున్నారు. 

అవినీతి పాలన అంతానికి ముందుకు రావాలి: రాజగోపాల్‌
రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానంగా యువత నడుం బిగించాలని కోరారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి లక్కారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి గుండెబోయిన రవికుమార్‌యాదవ్‌తో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందన్నారు.

తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అభివృద్ధి చేస్తోందని, పలు సంక్షేమ పథకాలు ప్రకటించిందని గుర్తుచేశారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవానికి అండగా నిలవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తే గ్రామాల్లోకి టీఆర్‌ఎస్‌ మిడతల దండు ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. చేసిన అభివృద్ది చూపించే పరిస్థితి లేకనే టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బు, మద్యం, బెదిరింపులను నమ్ముకుందన్నారు.   

మరిన్ని వార్తలు