కరోనా మృతుడికి ముస్లింల అంత్యక్రియలు 

15 May, 2021 17:33 IST|Sakshi

రంజాన్‌ వేళ వెల్లివిరిసిన మానవత్వం 

ఇబ్రహీంపట్నం: పవిత్ర రంజాన్‌ రోజున ముస్లిం యువకులు మానవత్వం చాటుకున్నారు. కరోనా వైరస్‌తో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు పూర్తిచేశారు. మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు రాచమళ్ళ వెంకటయ్య(48) కరోనా బారిన పడి శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటయ్య అంత్యక్రియలు చేయడానికి బంధువులు, గ్రామస్తులు ముందుకు రాలేదు.

ఈ విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ టీం సభ్యులు ఖాదర్, ఖాజా, గౌస్, ఇమ్రాన్‌ తమ వాహనంలో చంద్రాయన్‌పల్లికి చేరుకున్నారు. వారు పీపీఈ కిట్లు ధరించి వెంకటయ్య మృతదేహాన్ని ట్రాక్టర్‌లో గ్రామ సమీపంలోని శ్మశానవాటికకు తరలించి దహనం చేశారు.

>
మరిన్ని వార్తలు