అఖిల మృతిపై డీఎంఈ విచారణ

20 Sep, 2022 01:50 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న డీఎంఈ రమేశ్‌రెడ్డి 

ఆ ఘటనలో వైద్యుల తప్పిదం లేదని వెల్లడి 

బంధువులు ఆందోళనకు దిగినా పట్టించుకోని వైనం

నల్లగొండ టౌన్‌: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి విచారణ నిర్వహించారు. మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేం«ద్రంలో ఉన్న వార్డులను డీఎంఈ పరిశీలించారు.

ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తమను కించపరిచేవిధంగా దుర్భాషలాడుతున్నారని పలువురు ఆయనకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి వర్గాల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ అఖిల మృతిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని తెలిపా రు. కాన్పుల సందర్భంగా సిబ్బంది తీరుపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.

మరోవైపు మృతు రాలి అత్త, మామ, భర్త, కుటుంబసభ్యులు శిశువుతోపా టు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని డీఎంఈ కనీసం పలకరించకపోవడం గమనార్హం. ధర్నా లో కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ కూడా పాల్గొన్నారు. న్యాయంచేయాలని అఖిల మామ పోలీసు ల కాళ్లపైపడి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. 

మరిన్ని వార్తలు