కోవిడ్‌ పేషెంట్‌ కలకలం.. మార్కెట్‌లో ఆకుకూరలు అమ్ముతూ..

6 Jun, 2021 15:50 IST|Sakshi

సాక్షి, నల్గొండ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కారణంగా వేల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షలు అని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.అదే క్రమంలో వైరస్‌ సోకిన వారిని హోం ఐసోలేషన్‌, పౌష్టికాహారాలను తీసుకోవాలని సూచిస్తోంది. ఇంతలా చర్యలు తీసుకుంటూ, అప్రమత్తం చేస్తున్నా..  కొందరు మాత్రం ఏ భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  మాస్కులు లేకుండా కొందరు బయట నిర్లక్ష్యంగా తిరుగడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తూ వైరస్‌ వ్యాప్తికి దారులు తెరుస్తున్నారు.

మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ..
ఇంకొందరు అయితే కరోనా సోకి కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండకుండా.. బయట యధేచ్చగా తిరుగుతూ వారే ప్రాణాలే కాక ఇతర ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఓ మహిళ మార్కెట్‌లో సాఫీగా కూరగాయలు అమ్ముతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ క్వారెంటైన్‌లో ఉండకుండా బయట రోడ్లపై తిరుగుతుంది. ఇటీవల ఆమెకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇలా బయటకు వచ్చింది. అవగాహన లేమితో కారణంగా కూరగాయల మార్కెట్‌లో ఆకుకూరలు అమ్ముతోంది. ఇది గమనించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్‌ నాన్నకు..’

మరిన్ని వార్తలు