గుండ్లపల్లిలో క్షుద్రపూజల కలకలం

8 Jul, 2021 14:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ క్రైం: నల్లగొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బొల్లోజు వెంకటాచారి ఇంటి గేట్‌ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చేతి ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు, పసుపుకుంకుమ కలిపిన బియ్యం, జాకెట్‌ముక్క, జీడి, వక్క, గాజులు, గవ్వలు, వెంట్రుకలు, పాయింట్‌ ముక్క, తదితరాలు కలిపి ఉంచారు. బుధవారం తెల్లవారుజామున వెంకటాచారి భార్య రత్నమ్మ ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూడగా ఈ వస్తువులన్నీ కనిపించడంతో భయాందోళనకు గురై కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలను, ఇంటిఎదుట వదిలివెళ్లిన వస్తువులపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. కీలక ఆధారాలు లభించడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందం గాలిస్తోంది.
వివాహబంధం తెంచే కుట్ర..
జూన్‌ 16న వెంకటాచారి చిన్న కుమారుడు ప్రవీణ్‌చారితో నల్లగొండకు చెందిన యాదగిరి – సావిత్రిల కుమార్తె అఖిలతో వివాహం జరిగింది. కుటుంబ బంధాన్ని తెంచేందుకు గిట్టనివారు ఎముకలు, జీడిగింజలు, పసుపు బియ్యం తదితర వస్తువులను కలిపి ఇంటి గేట్‌ ఎదుట వదిలి వెళ్లి ఉంటారని, అఖిల తల్లిదండ్రులకు గిట్టనివారే ఈపని చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు..
బైక్‌పై వచ్చిన దుండగులు వెంకటాచారి ఇంటి ఎదుట భయంగొలిపే వస్తువులను వదిలివెళ్లినట్లు గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. వీటి ఆధారంగా ఆ ఇంటి నుంచి వచ్చిపోయిన ఫోన్‌ కాల్స్‌ను, అఖిల తల్లిదండ్రులైన యాదగిరి– సావిత్రిలకు గిట్టనివారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు