నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్‌రెడ్డి 

27 Aug, 2022 02:13 IST|Sakshi
నానో యూరియా వాడకాన్ని పరిశీలిస్తున్న మంత్రి, ఇతర అధికారులు  

ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.  రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని  పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  

మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్‌ రాలియా దీనిని కనుగొన్నారని,  11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్‌ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, ఇఫ్కో జీఎం డాక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మెన్‌ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్‌ హన్మంతు, ఆగ్రోస్‌ ఎండీ రాములు, మార్కెఫెడ్‌ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు