ప్రకృతి సోయగం.. అటవీ అందాలు..

27 Sep, 2020 10:58 IST|Sakshi

సాక్షి, పెంచికల్‌పేట్‌: రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవు పెంచికల్‌పేట్‌ అడువులు.. ఎత్తైన కొండలు, గలగల పారే ప్రాణాహిత, పెద్దవాగులు ఓ వైపు..  పచ్చని అడువులు, పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి శబ్దాలు, జాలువారుతున్న జలపాతాలు, జీవ వైవిద్యమైన అడవులు మరో వైపు.. వెరసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలను చూడటానికి ఇక్కడి వచ్చే వారిని ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటలను ఆకట్టుకోవడంతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి  చూపుతున్నారు. 

రాబంధుల స్థావరం పాలరాపు గుట్ట
పాలరాపు గుట్టలో రాబంధులు
అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబంధులను పాలరాపు గుట్ట వద్ద గుర్తించి వాటి సంతతి అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు. అధి కారులు చేపట్టిన కృషితో వాటి సంతతి ప్రస్తుతం 30కి చేరింది. రాపుగుట్ట వద్ద రాబంధులకు ఆవా సం అనుకూలంగా ఉండటంతో ఇటీవలే అరుదైన హిమాలియన్‌ గ్రాఫీన్‌ రాబంధు, రూఫోస్‌బిల్డ్‌ ఈగల్‌లను అధికారులు గుర్తించారు.

సిద్దేశ్వర గుట్టలు
పెంచికల్‌పేట్‌ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో సిద్దేశ్వర గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల్లో శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండగా గుట్టలో ఏడు సొరంగ మార్గాలు, గుహలు ఉన్నాయి. గుట్టల పరిసర ప్రాంతాల్లో జాలువారే జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి.

కొండపల్లిలో వృక్ష శిలాజాలు
వృక్ష శిలాజాలు
పెంచికల్‌పేట్‌ మండలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో ఆరున్నర కోట్ల సంవత్సరాల వృక్షశిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో 9 నుంచి 25 అడుగుల పొడుకలిగిన వివిధ రకాల     వృక్షశిలాజాలు ఉన్నాయి.

గుండెపల్లి దొద్దులాయి జలపాతం 
జలపాతాలు
గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం, అగర్‌గూడ అటవీ ప్రాంతంలోని కొండెంగ లొద్ది సీజనల్‌ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో ఆయా జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నాయి.

అడవిలో ఊటల్లో నీరు తాగుతున్న వన్యప్రాణులు
వన్యప్రాణులు
పెంచికల్‌పేట్‌ రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉండడంతో అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకున్నాయి. ఈ అడవి ప్రాంతంలో  పెద్దపులులు నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంది. అటవీ ప్రాంతంలో చిరుతపులులు, హైనాలు, తోడేళ్లు, నక్కలు, సాంబారు, నీలుగాయి, జింకలు, కనుజు, కొండగొర్రె, ముళ్లపందులు, అడవి పందులు సంచరిస్తున్నాయి.

ఎల్లూర్‌ ప్రాజెక్టులో పక్షుల సందడి
పక్షుల కిలకిల రాగాలు...
ప్రాణాహిత, పెద్దవాగు, ఎల్లూర్‌ బొక్కివాగు ప్రాజెక్టు, ఉచ్చమల్లవాగు ప్రాజెక్టుల్లో నిరంతం నీరు ప్రవహిస్తుండగా పచ్చని అటవీప్రాంతం, ఎత్తైనన కొండల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పక్షులు అడువులను నివాస యోగ్యంగా మార్చుకున్నాయి. సుమారు 250 రకాల పక్షులు పెంచికల్‌పేట్‌ అడువుల్లో ఆవాసాన్ని ఏర్పాటు  చేసుకున్నాయి.

అగర్‌గూడ అడవిలో ఉబికివస్తున్న నీటి ఊటలు

పొడుగు ముక్కు రాబంధులు

ప్రాణాహిత,పెద్దవాగు సంగమమం

మరిన్ని వార్తలు