పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్‌ గదులు 

25 Aug, 2020 01:52 IST|Sakshi

శరీర ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలకు మించితే వాటిల్లోనే పరీక్ష 

కరోనా అనుమానితులకు కూడా.. 

‘నీట్‌’మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్‌టీఏ 

పరీక్ష కేంద్రం మొత్తం శానిటైజ్‌ 

స్లాట్ల పద్ధతిలో విద్యార్థులకు అనుమతి 

పరీక్ష రాయాలంటే మాస్క్, శానిటైజర్‌ తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు 99.4 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తేలితే వారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదిలో ‘నీట్‌’పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కూడా ఐసోలేషన్‌ గదిలోనే పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వచ్చేనెల 13న జరగనున్న నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ అండ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2020) మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. నీట్‌(అండర్‌ గ్రాడ్యుయేట్‌)–2020కు 15,97,433 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
నీట్‌ నిర్వహణ మార్గదర్శకాలివీ.. 
►పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపులుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తారు. 
ళీ ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు. విద్యార్థుల సెల్‌ఫోన్లకు ఆయా వివరాలను మెసేజ్‌ రూపంలో పంపిస్తారు. 
►పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా భౌతిక దూరం పాటించేందుకు గేటు బయట తాళ్లు కడతారు. వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తారు.  
►థర్మోగన్స్‌ ద్వారా ప్రవేశ ద్వారం వద్ద సిబ్బంది సహా విద్యార్థులందరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. కరోనాకు సంబంధించిన స్థానిక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను పరీక్షా కేంద్రాల్లో ప్రముఖంగా ప్రదర్శిస్తారు. అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. 
►పరీక్షా గదిలోకి విద్యార్థులతోపాటు మాస్క్, గ్లోవ్స్, వాటర్‌ బాటిల్, సొంత శానిటైజర్‌ (50 మి.లీ.), అడ్మిట్‌ కార్డ్, ఐడీ కార్డ్‌లకు మాత్రమే అనుమతిస్తారు. మరే ఇతర వస్తువులను అనుమతించరు. మా స్క్, శానిటైజర్‌ తప్పనిసరి తెచ్చుకోవాలి. 
►పరీక్షా కేంద్రంలో సిబ్బందికి, గేటు వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులకు గ్లోవ్స్, మాస్క్‌లు ఉండాలి.  
►పరీక్షా కేంద్రాల లోపల టేబుల్, డోర్‌ హ్యాండిల్స్, లిఫ్ట్‌ బటన్స్‌ వంటి వాటిపై వైరస్‌ చేరకుండా సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. 
►పరీక్షా కేంద్రాల అంతస్తులు, గోడలపై స్ప్రే చేయాలి. అన్ని వాష్‌రూమ్‌లను శుభ్రపరచాలి. చేతులు కడుక్కోవడానికి వీలుగా వాష్‌రూంలలో సబ్బు ఉండాలి.   

మరిన్ని వార్తలు