కరీంనగర్: నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్ కశ్మీర్గడ్డలో ఉన్న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాంబయ్య 1985లో జనతా దళ్ నుంచి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు.
ఆయన కుమారుడు ఉప్పరి రవి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా పొన్నం ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఉప్పరి సాంబయ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యార్థుల పలు సమస్యలను చెబితే వెంటనే స్పందించారని గుర్తుచేసుకున్నారు. సాంబయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సంతాపం తెలిపారు.