పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త ప్యాకేజీ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది.
చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం..
పర్యటన ఇలా...
మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్.
ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.