హైదరాబాద్‌ వాసుల్లో న్యూ ఇయర్‌ జోష్‌.. ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్లు బంద్‌.. 

29 Dec, 2022 08:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు  స్వాగతం పలు కుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్‌ ఏర్పడింది. 

తక్కువ ధరలో ఎంట్రీ.. 
నగరవాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకూ న్యూ ఇయర్‌ ఈవెంట్లకు ధరలను కొంతవరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్‌ సోనిక్‌ టేకోవర్‌ పేరుతో నోవోటెల్‌  నిర్వహిస్తున్న ఈవెంట్‌కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా... తాజ్‌ డెక్కన్‌ ఎ నైట్‌ ఇన్‌ ప్యారిస్‌.. థీమ్‌ ఈవెంట్‌ కు బుకింగ్‌ ధర రూ. 1200తో ప్రారంభించింది. పార్క్‌ హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ పారీ్టకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీ యానిమల్స్‌కు కేరాఫ్‌ లాంటి ప్రిజ్మ్‌ క్లబ్‌ అండ్‌ కిచెన్‌లో ది ప్రిజ్మ్‌ సర్కస్‌ ఈవెంట్‌కు రూ.4వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్‌ ఆడిటోరియంలలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కు సమీపంలోనే ధరలు ఉన్నాయి.  

తరలివస్తున్న సంగీతం... 
నోవోటెల్‌లో ఆర్టిస్ట్‌ ఎమ్‌కెషిÙఫ్ట్‌... (ఎమ్‌కెఎస్‌హెచ్‌ఎఫ్‌టీ) పేరొందిన లైవ్‌బ్యాండ్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నో పాజ్‌ పారీట్ల డిజెషాన్, ఆర్యన్‌ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెన్షన్‌ దర్శన్‌ రావల్‌తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్‌/సినీ గాయకుడు రామ్‌ మిరియాల హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో థండర్‌ స్టైక్‌ పార్క్‌ పాటలతో అలరించనున్నారు.

కంట్రీక్లబ్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్‌లో డిజె ఆసిఫ్‌ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్‌ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్‌ హోటల్‌ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్‌ ఫీస్టా థీమ్‌ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్‌లు అతిథులను ఉత్సాహపరచనున్నారు.
  
వండర్‌లాలో.. సన్‌బర్న్‌.. 
కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్‌గా పేరొందిన సన్‌బర్న్‌ తిరిగొచ్చింది. సన్‌బర్న్‌ రీలోడ్‌ ఈవెంట్‌ నగరశివార్లలోని వండర్‌ లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్‌ సెన్సేషన్‌ జియాన్‌ నోబిలీ, డైనమిక్‌ డీజె  ఈడీఎం సంగీతానికి పేరొందిన  జెఫిర్టోన్‌ – టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు అతిధుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు.

మందుబాబులూ.. పారాహుషార్‌ 
కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే వేళ.. డ్రంకెన్‌ డ్రైవ్‌లు చేపట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. బార్‌లు, పబ్‌లు, వినోద కేంద్రాలు ఉండే వాణిజ్య ప్రాంతాల్లోని మార్గాలలో ట్రై కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు 31న రోజంతా విధులు నిర్వర్తిస్తారు. బ్రీత్‌ అనలైజర్లు, బారికేడ్లు ఇతరత్రా ఉపకరణాలను సిద్ధం చేశారు. మహిళా డ్రైవర్లు, మద్యం తాగిన మహిళలను తనిఖీలు చేస్తున్న సమయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డీడీ చెకింగ్‌ కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు విధులు కేటాయించామని ఓ ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.  
  
ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్లు బంద్‌.. 
► 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జాము వరకు నెక్లెస్‌ రోడ్, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌ రింగ్‌ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు.  

► మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్‌ డ్రైవింగ్, బైక్‌లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్‌ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు