Nalgonda: కెనడాలో ఆమెను చూసి పెళ్లి చేసుకున్నాడు.. 15 రోజ్లులోనే ఇలా జరిగింది 

10 Jun, 2022 16:33 IST|Sakshi

నకిరేకల్‌: పెళ్లయిన 15రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతిచెందిన ఘటన మండలంలోని గోరెంకలపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆద పృథ్వీ(29)కి గత నెల 26న విజయవాడకు చెందిన భార్గవితో వివాహం జరిగింది. వీరిద్దరూ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం పృథ్వీ తన తండ్రి రాజేందర్‌తో కలిసి కారులో నకిరేకల్‌ మీదుగా హాలియాకు బయల్దేరాడు. 

ఈ క్రమంలో నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లి శివారులోని మూలమలుపు వద్ద కరీంనగర్‌ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ తీవ్రంగా గాయపడడంతో ఆస్పపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి తండ్రి రాజేందర్‌ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసున్న క్రమంలోనే భార్గవితో పరిచయం కావడంతో ఇరువురు ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. మరో వారం రోజుల్లో కెనడాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

పెళ్లయిన 15రోజులకే పృథ్వీ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి రాజేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగారెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. 

ఇది కూడా చదవండి: రెండు నెలల క్రితమే పెళ్లి..  కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని

మరిన్ని వార్తలు