రాష్ట్రానికి నానో యూరియా

17 Jul, 2021 04:00 IST|Sakshi

గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ట్రక్‌

జెండా ఊపి ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్‌లోని కలోల్‌ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆన్‌లైన్‌ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్‌ చైర్మన్‌ దిలీప్‌ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు.

నానో ప్రత్యేకతలివే
♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి.
♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్‌ లిక్విడ్‌ నానో యూరియా బాటిల్‌ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.  
♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్‌ పొందింది.  
♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది.

మరిన్ని వార్తలు