ఎన్‌ఎంఓపీ జాతీయ సెక్రెటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ   

30 Jan, 2023 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన కంపెనీలకు ఇచ్చిన అప్పులతో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగుల జీతాల నుంచి జమ చేసుకుంటున్న నిధులకు ముప్పు ఏర్పడుతుందని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ (ఎన్‌ఎంఓపీ) జాతీయ సెక్రటరీ జనరల్‌ గంగాపురం స్థితప్రజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు.

హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం అదానీ కంపెనీలకు ఎల్‌ఐసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన రుణాలలో సీపీఎస్‌ ఉద్యోగులకు చెందిన 67 శాతం పింఛన్‌ నిధులున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఎంఓపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ రూ.77వేల కోట్లు, ఎస్‌బీఐ రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని, ఇప్పుడు కంపెనీల షేర్లు పతనం కావడంతో దేశంలోని 84 లక్షల మంది ఉద్యోగుల సొమ్ము ఆవిరైపోతోందని చెప్పారు.   

మరిన్ని వార్తలు