ముందస్తు ముచ్చటే లేదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం టీఆర్‌ఎస్‌దే: సీఎం కేసీఆర్‌ 

22 Mar, 2022 02:13 IST|Sakshi

2024లో భారత్‌లో సంపూర్ణ క్రాంతి వస్తుంది 

జాతీయ రాజకీయాల్లో అద్భుత పాత్ర పోషిస్తా

ఈడీ తరహా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు భయపడేది లేదు 

ప్రశాంత్‌ కిషోర్‌ మిత్రుడు.. దేశ రాజకీయాల కోసం పనిచేస్తున్నాం 

త్వరలో బీజేపీయేతర సీఎంలు, ఇతర నేతలతో సమావేశం 

రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీపైనా ఉద్యమం చేస్తాం 

చినజీయర్‌ స్వామితో విభేదాలేమీ లేవని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘మేం ప్రారంభించిన పథకాలు, పనులు పూర్తి చేసేందుకే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నాం. 88 సీట్లతో అధికారంలోకి వచ్చాం. ఇప్పుడా అవసరం లేదు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక, ఐటీ పెట్టుబడులు సాధించాల్సి ఉంది. ఏ స్థాయీ లేనివాళ్లు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడితే మాకు సంబంధం లేదు’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సేనని పేర్కొన్నారు.

2023 ఎన్నికల తర్వాత తాను రాష్ట్రంలో ఉంటానా.. జాతీయ రాజకీయాల్లోకి వెళతానా అన్నదానిని సమయం నిర్ణయిస్తుందన్నారు. ఎక్కడ అవసరముంటే అక్కడికి వెళ్తానని.. తాను జాతీయ రాజకీయాల్లో అద్భుత పాత్ర పోషిస్తాననేది మాత్రం ఖాయమని వ్యాఖ్యానించారు. చినజీయర్‌ స్వామితో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు కేసీఆర్‌ మాటల్లోనే.. 

మేమిచ్చే నివేదికతో ఆశ్చర్యపోతారు 
‘‘వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్‌ పార్టీయే. 2014లో 63 సీట్లతో, 2018లో 88 సీట్లతో అధికారంలోకి సాధించిన మేం.. ఈసారి 95 నుంచి 105 స్థానాలు సాధిస్తాం. 25 రోజుల్లో మేమిచ్చే నివేదికతో అంతా ఆశ్చర్యపోతారు. తాజాగా మూడు వేర్వేరు సంస్థలతో 30 స్థానాల్లో నిర్వహించిన సర్వేలో 29 చోట్ల మాకు అనుకూల ఫలితం వచ్చింది. మిగతా ఒకచోట కూడా ఓట్ల తేడా 0.3శాతం మాత్రమే.  

ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిందే.. 
ఏ రంగం చూసినా ఈ దేశంలో తిరోగమనమే. అభి వృద్ధి లేదు, జీడీపీ పెంచేదిలేదు. ఆకలిచావులు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. యువత నిరుద్యోగ ఇండెక్స్‌లో లాస్ట్‌ ర్యాంకులో ఉన్నాం. సిరియా కంటే అధ్వానంగా ఉన్నాం. గతంలోని యూపీఏ, ఇప్పటి మోదీ ప్రభుత్వాల విధానాలే కారణం. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇంతకంటే ఏమీ చేయలేమని చెప్పింది. అందుకే ప్రగతిశీల విధానం లో పనిచేసే ప్రభుత్వం రావాలి. జాతీయ రాజకీయాల్లోని ఈ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీకో, మరో పార్టీకో వ్యతిరేకంగా అని కాకుండా.. దేశ ప్రజల మేలు కోరే ఫ్రంట్‌ రావాలి. 50 ఏళ్ల రాజకీ య అనుభవంతో చెప్తున్నా.. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం వస్తుంది. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం పయనిస్తుంది. 

కొంత టైం పడుతుంది.. 
జాతీయస్థాయిలో ఏర్పాటయ్యేది వేదికా, ఫ్రంటా అన్న విషయంపై స్పష్టత లేదు. చర్చలు సాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో బడ్జెట్‌ సమావేశాలు జరు గుతుండటంతో బీజేపీయేతర సీఎంల సమావేశానికి కొంత సమయం పడుతుంది. ఆ సమావేశంలో సీఎంలే కాకుండా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు కూడా పాల్గొంటారు. ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా చర్చించి 2024లో ప్రజలను కదిలించేందుకు ఏది ఉత్తమమైనదో ఆ ప్రక్రియను అనుసరిస్తాం. 
ధాన్యంతో ఆగబోం.. అన్ని రంగాలపై పోరాటం 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలి. దీనిపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ధాన్యంపై ఆందోళనలతోనే ఆగిపోబోం. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ధర్నా చేస్తాం. రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రాన్ని నిలదీస్తాం. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీనిపైనా పో రాడుతాం. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు కేసీఆర్‌ భయపడడు. ఆ తరహా బెదిరింపులు అన్నిచోట్లా పనిచేయవు. దాడులు చేయాలనుకుంటే స్వాగతం. ఈడీ కాకుంటే బోడీ దాడులు చేయండి. 

గూండాగిరీ చేస్తున్నారా? 
యూపీ బుల్‌డోజర్లు ఇక్కడకు వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. రానివ్వండి.. ఇక్కడ పని దొరికితే చేసుకుని బతుకుతారు. శివాజీ విగ్రహం పేరిట బీజేపీ నేతలు గూండాగిరీ చేయాలనుకుంటు న్నారా? అనుమతి తీసుకుని విగ్రహం పెడితే ఎవ రు కాదంటారు? దమ్ముంటే ప్రజా సమస్యల పై దృష్టిపెట్టాలి. మేం తెలంగాణ ఉద్యమంలో సకలజ నుల సమ్మెపెట్టాం. అంతేతప్ప హిందూ– సిక్కు– ముస్లిం సమ్మె అని పెట్టలేదని గుర్తుంచుకోవాలి. 

చచ్చినా పాదయాత్ర చేయను 
ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు. నేను మాత్రం చచ్చినా పాదయాత్ర చేయబోను. అది ఓల్డ్‌ టాక్టిక్‌. కేలండర్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రేషనలైజేషన్‌లో భాగంగా అవసరమైతే మరో 10వేల మంది ఉపాధ్యాయులను నియమించి ప్రతీ స్కూల్‌లో అన్ని సబ్జెక్టుల టీచర్లు ఉండేలా చర్యలు చేపడతాం.     – కేసీఆర్‌

కశ్మీర్‌ ఫైల్స్‌ అంటూ విద్వేషాలా? 
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20వేల మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఎంతో ఇబ్బందిపడ్డారు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు మానసిక వ్యథ అనుభవించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మెడికల్‌ విద్యార్థులను మేమే చదివిస్తామని ప్రకటించాం. తర్వాత బెంగాల్‌ కూడా ప్రకటించింది. కానీ విద్యార్థులకు అండగా ఉండటంపై కేంద్రం నుంచి మాత్రం ఉలుకు, పలుకు లేదు. కానీ కశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలను ప్రోత్సహిస్తూ విద్వేషాలు సృష్టించడం, సమాజాన్ని విడదీయడంలో బీజేపీ బిజీగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులిచ్చి మరీ ఆ సినిమా చూపిస్తున్నారు. కశ్మీర్‌ పండిట్ల విషయంలో ఉత్త తియ్యటి మాటలు కాకుండా.. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. అలాకాకుండా హిందూ ధర్మాన్ని అమ్ముకుని ఓట్లు దండుకోవడాన్ని మేం ఖండిస్తున్నాం. ఇది దేశ హితానికి మంచిది కాదు.   

కదిలించే పని మొదలైంది.. 
దేశంలోని 20 లక్షల మంది అడ్వొకేట్లు, 1,018 యూనివర్సిటీలు, 45 వేల నుంచి 65 వేల డిగ్రీ కాలేజీల్లో యువత, విద్యార్థులను కదిలించేందుకు అవసరమైన పని మొదలైంది. పీకే ఇదే పనిమీద ఉండగా.. మేమూ రోజూ 3–4 గంటలు కేటాయిస్తున్నాం. అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి పరిపూర్ణ విజయం సాధిస్తాం. 

పీకే పెయిడ్‌ వర్కర్‌ కాదు.. 
దేశంలో మార్పు కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నాతో కలిసి పనిచేస్తుంటే బాంబులా భయపడుతున్నారు. సర్వేల ద్వారా ప్రజల నాడి పట్టుకునే కళ ఆయన దగ్గరుంది. ఎనిమిదేళ్లుగా పీకే నాకు మిత్రుడు. కేవలం తెలంగాణ కోసమే కాదు.. దేశ రాజకీయాల్లో నాతో కలిసి పనిచేస్తున్నారు. డబ్బు తీసుకొని పనిచేసేందుకు ఆయన పెయిడ్‌ వర్కర్‌ కాదు. దేశంపట్ల నిబద్ధత ఉన్న పీకేను డబ్బులు తీసుకొని 
పనిచేస్తాడని బద్నాం చేస్తున్నారు. 

ఎల్లుండి నుంచి లడాయి షురూ.. నిరసనల కార్యాచరణ ఇదీ..

  • 24న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక భేటీలు. మర్నాటి నుంచే నిరసనలు
  • 26న గ్రామ పంచాయతీలు, 27న మండల పరిషత్‌లు, 30న జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే తీర్మానాలు చేయాలి. 
  • ప్రతీ ఇంటి నుంచి ప్రధాని మోదీకి పంపించేందుకు పిడికెడు ధాన్యం సేకరించాలి. 
  • గ్రామాల్లో కుల సంఘాలతో సహపంక్తి భోజనాలు చేయాలి.
  • ఈ మధ్యలోనే రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డిల బృందం.. ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెస్తుంది. కేంద్రం నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి ఉగాది తర్వాత ఢిల్లీలో ఆందోళనలు, ధర్నా చేపడతాం
  • వచ్చే నెల 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు ఉభయసభల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తారు.
  • బీజేపీ విధానాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో సదస్సు నిర్వహిస్తాం.
  • కశ్మీర్‌ ఫైల్స్‌ వంటి అంశాలతో 
  • బీజేపీ సృష్టిస్తున్న ట్రాప్‌లోకి వెళ్లకుండా, నిజాలు ప్రజలకు, యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతాం. 

ఆ మూడు అంశాలతో వెళితే.. 
రాజకీయాల్లో ధోరణులు (ట్రెండ్‌), పరిస్థితులు (సిచ్యువేషన్స్‌), సమీకరణాలు (ఈక్వేషన్స్‌) అనే మూడు అంశాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు ఉంటే ఫలితం సాధ్యమవుతుంది. దేశంలో బహుముఖ నిర్మాణాత్మక పరివర్తన కోసం నేను అద్భుత పాత్ర పోషిస్తాననడంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తా..  – సీఎం కేసీఆర్‌

>
మరిన్ని వార్తలు