రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లోనే.. మ్యుటేషన్‌

26 Jun, 2021 07:56 IST|Sakshi

మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మ్యుటేషన్‌ బాధ్యతలు రిజిస్ట్రేషన్ల శాఖకు బదిలీ 

ప్రస్తుతానికి ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న భవనాలకు మాత్రమే..​​​​​​

వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పైలట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న సబ్‌–రిజిస్ట్రార్లు 

జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖలతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ అనుసంధానం 

త్వరలోనే ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ల బదిలీ యోచన 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్‌ ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్‌ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్‌ ప్రక్రియను పైలట్‌ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్‌ను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే మ్యుటేషన్‌ ప్రక్రియ కోసం జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేశారు.

అయితే, జీహెచ్‌ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్‌ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్‌ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్‌కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని 

మ్యుటేషన్‌ అంటే.. 
ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్‌ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా మ్యుటేషన్‌ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్‌ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్‌ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్‌) చేసేవారు.

అయితే, ఈ మ్యుటేషన్‌ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్‌ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్‌ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్‌ ఫీజు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే మ్యుటేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీటీఐఎన్‌)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు