కరోనా.. పాతబస్తీలో క్యా కర్నా..!

24 Mar, 2021 14:27 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనలు పాటించని పాతబస్తీ వాసులు 

సందడిగా కనిపిస్తున్నపర్యాటక ప్రాంతాలు... 

కనిపించని భౌతిక దూరం..మాస్కులు 

చార్మినార్‌/గోల్కొండ: పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులతో పాటు స్థానికులు కోవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. కరోనా వైరస్‌  భయం పర్యాటకుల్లో ఎక్కడా కనిపించడం లేదు. చాలా వరకు భౌతిక దూరంతో పాటు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు వినియోగ దారులతో కళకళలాడుతున్నాయి. వ్యాపారులు కూడా కరోనా జాగ్రత్తలు పాటించడం లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. 

► కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందనే సమాచారంతో కొంత మంది భయాందోళనలు వ్యక్తం చేస్తుండగా...మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  
► ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.  
► సందర్శకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్, మక్కా మసీదు, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, జూపార్కు తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.  
► దీంతో ఆయా పర్యాటక ప్రాంతాల వద్ద సందర్శకుల రద్దీ పెరుగుతోంది.  
► చిరు వ్యాపారాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి.  

కోవిడ్‌ నిబంధనల అమలు శూన్యం... 
గోల్కొండ: ప్రధాన మార్కెట్లలో కోవిడ్‌–19 నిబంధనలు అమలు కావడం లేదు. కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మెహిదీపట్నంలోని రైతుబజార్‌తో పాటు గుడిమల్కాపూర్‌లో కూరగాయల మార్కెట్, ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌లో మచ్చుకు ఒక్క  కోవిడ్‌–19 నిబంధన కూడా అమలు కావడం లేదు. మెహిదీపట్నంలోని రైతుబజార్‌కు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తున్నారు. అలాగే గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌కు కూడా పూలు, కూరయగాలు పండించే రైతులతో పాటు కమీషన్‌ ఏజెంట్లు, చిల్లర వ్యాపారాలు వస్తుంటారు.  
► ప్రధాన మార్కెట్లలో మాత్రం అధికారులు కోవిడ్‌–19 నిబంధనలను అమలు చేయడం లేదు. 
► గతంలో  గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌లో పలువురు వ్యాపారులు కరోనా పాజిటివ్‌ బారినపడ్డారు. 
► అయితే మార్కెట్‌ పాలక మండలి వారు మార్కెట్‌ను శానిటైజ్‌ చేసి మార్కెట్‌ కార్యాలయం వద్ద సెల్ఫ్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. 
► అదే విధంగా మెహిదీపట్నం రైతుబజార్‌లో కూడా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. 
► సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రైతుబజార్‌లో వేల మంది కొనుగోలుదారులు ఉంటారు. 
► రైతుబజార్‌కు ఉన్న రెండు గేట్లు వద్ద కూడా థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజ్‌ ఏర్పాట్లు లేవు. 
► గేట్ల వద్దే అనుమతులు లేని కూరగాయలు, పండ్ల స్టాళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. 
► విశాలమైన గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌లో కూడా కోవిడ్‌–19 అమలు కావడం లేదు. 
► రాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ఇక్కడ హోల్‌ సేల్‌ వ్యాపారం జరుగుతుంది.  
► కమీషన్‌ ఏజెంట్లు, రైతులు, కూలీలు వేల సంఖ్యలో ఉంటారు. 
► కూరగాయల రిటెయిల్‌ మార్కెట్లు సైతం వందల స్టాళ్లు ఉన్నాయి. 
► ఉదయం నుంచి రాత్రి వరకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. 
► అదే విధంగా ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌లో కూడా నిబంధనలు అమలు కావడం లేదు. 
► కూరగాయల స్టాళ్లు, అందులో పనిచేసే సిబ్బంది, పూల రైతులు, రిటైల్‌ కొనుగోలుదారులు, రిటైల్‌ అమ్మకందారులు ఇలా మార్కెట్‌లో అర్ధరాత్రి వేల సంఖ్యలో  గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. 
(చదవండి: ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్‌.. మరొకటి నెగిటివ్)

వ్యాపారులకు కరోనా పరీక్షలు తప్పసరి చేయాలి..  
ప్రధాన మార్కెట్‌లోని వ్యాపారులకు కరోనా నిర్ధారణ టెస్టులు తప్పనిసరి చేయాలి. వ్యాపారులు సైతం పరీక్షలు చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
–జి. ప్రహ్లాద్, గుడిమల్కాపూర్‌ 

మరిన్ని వార్తలు