చక్రాల కింద ఇరుక్కుని.. చావుని తప్పించుకుని..

11 Jul, 2022 03:41 IST|Sakshi

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్‌కు వచ్చాడు.

ద్విచక్ర వాహనంతో లారీ కింద ఇరుక్కున్న విఘ్నేశాచారి

పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్‌ తీసుకునేందుకు బస్టాండ్‌ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్‌ చేస్తుండగా హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్‌ అలాగే ముందుకు పోనిచ్చాడు.

అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ప్రాణాపాయం తప్పింది.  

మరిన్ని వార్తలు