38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్‌

29 Jun, 2022 07:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్‌ సీఎస్‌ల నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఈఎన్‌సీల వరకు కొంతకాలంగా హెచ్చరించినా విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన 38 మంది ఇంజినీర్లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారికి ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. 13 సర్కిళ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు(ఏఈ) వీరిలో ఉన్నారు.  డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు  ఉన్నారు.  

  • గత సంవత్సరం అక్టోబర్‌లో నాలాల సమస్యలు వర్షాకాల విపత్తులపై అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్, భవిష్యత్‌లో ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పలు పర్యాయాలు ఉన్నతాధికారులతో నిర్వహించిన  సమీక్ష సమావేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీరియస్‌గా హెచ్చరించారు. స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌కుమార్‌ పూర్తి కావాల్సిన పనులు కాలేదని  గత నెలాఖరులో తీవ్ర అసంతప్తి  వ్యక్తం చేస్తూ జూన్‌ 5లోగా పనులు పూర్తిచేయాలని మెమో జారీచేశారు. కమిషనర్‌ లోకేశ్‌కుమార్, ఈఎన్‌సీ జియావుద్దీన్‌లు సైతం పలు సందర్భాల్లో అలర్ట్‌ చేస్తూ, సీరియస్‌గా చెప్పినా పనులు పూర్తికాలేదు.  
  • ఈ నేపథ్యంలో స్వయానా ఈఎన్‌సీ తోపాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తికాని పనుల ఫొటోలతో సహా పంపిస్తూ కొన్నిరోజులుగా దాదాపు 50 మందికి  షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. పనులు పూర్తిచేసి.. ఫొటోలు జోడించి, తగిన వివరణ ఇచ్చిన వారికి తదుపరి కఠినచర్యలు  తీసుకోకుండా జీతంలో కోత విధించారు.  తిరిగి ఇలాంటి ఘటనలు పునరావతమైతే  ఎలాంటి నోటీసు లేకుండానే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు.  
  • క్రిమినల్‌ కేసు నమోదుతోపాటు నోటీసుల్లేకుండానే ఉద్యోగం కూడా ఊస్ట్‌ అవుతుందనే హెచ్చరికలు ఇదివరకే  జారీ చేసినా నిర్లక్ష్యం కనబరుస్తున్నవారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నందున, ప్రజలకు ప్రాణాంతకంగా ఉన్న ప్రాంతాల్లో నూరుశాతం సేఫ్టీ ఏర్పాట్లు చేయాలన్నా చేయకపోవడంతో  తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ  ప్రస్తుతానికి ఈ చర్య తీసుకున్నారు. బల్దియా చరిత్రలోనే ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమమని జీహెచ్‌ఎంసీ వర్గాలంటున్నాయి.

ఈ సర్కిళ్లలోని వారికి.. 
జీతాల కోత పడిన వారిలో అల్వాల్, చందానగర్, శేరిలింగంపల్లి, కాప్రా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, యూసుఫ్‌గూడ, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్‌ సర్కిళ్లకు చెందిన ఇంజినీర్లున్నారు. వారిలో..  ఈఈలు.. కేవీఎస్‌ఎన్టీ రాజు, సి.శ్రీకాంత్, డి.ఆశాలత, ఆర్‌.ఇందిరాబాయి, ఆర్‌. లక్ష్మణ్, యు, రాజ్‌కుమార్, బి.రాములు, టి.లక్ష్మా, బి.నరేందర్‌గౌడ్, వి.శ్రీనివాస్‌ (ఎఫ్‌ఏసీ), డి.గోవర్ధన్‌గౌడ్‌ (ఎఫ్‌ఏసీ), పి. కష్ణచైతన్య,  వి.హరిలాల్‌(ఎఫ్‌ఏసీ).  

డిప్యూటీ ఈఈలు.. 
ఎం.కార్తీక్, ఎస్‌. స్రవంతి, ఎస్‌.రఘు, పీసీవీ కష్ణకుమార్, ఈ.లౌక్య, ఎస్‌. శ్రీరాములు, డి.దేవేందర్, ఎం. వెంకటేశ్వర్లు, బి.శంకర్, ఎస్‌.శిరీష, బి.భానుచందర్‌. 
కె.అరుణ్‌కుమార్, ఎంవీ శివరామ్‌ప్రసాద్, సీహెచ్‌.సునీల్‌కుమార్, జి.సంతోష్‌కుమార్‌రెడ్డి, ఎన్‌.కౌశిక్, వి.శ్రీనివాసరావు, జి.చరణ్, కె.దివ్యజ్యోతి,ఎండి జమీల్‌పాషా, ఎస్‌ఎంఆర్‌ అన్సారీ, ఎంఏ రహీమ్, ఎల్‌.బల్వంత్‌రెడ్డి, టి.సంపత్‌కుమార్, ఆర్‌.మల్లారెడ్డి.    

(చదవండి: సీఐకి రివర్స్‌ పంచ్‌)

మరిన్ని వార్తలు