Corona Virus: మూడింట ఒకటి...  ‘మహా’ డేంజర్‌!

14 May, 2021 01:30 IST|Sakshi

దేశంలో ప్రతి 3 కేసుల్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్‌

ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకునే వైరస్‌ 

నేరుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపడంతో ఎక్కువ మందికి శ్వాస సమస్యలు

అక్కడ్నుంచి క్రమంగా పొట్టలోకి వెళ్లడంతో డయేరియాగా మార్పు

ఎన్నికల సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలకు జన సమూహాలు చేరడం, అజాగ్రత్తల వల్లే వ్యాప్తి

ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ మ్యుటేషన్‌గా పేరుపొందిన మహారాష్ట్ర వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్‌ ఇప్పుడు దేశంలో విస్తృత ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్‌ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. వివిధ దేశాల్లో వైరస్‌ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్ర వేరియంట్‌ను ప్రస్తావించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా పది రకాల వేరియంట్లు  ప్రభావవంతంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఈ పదింట్లో కేవలం మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) మాత్రమే అత్యంత ప్రభావవంతమైనవని, మిగతా ఏడు సాధారణమైనవని తెలిపింది. తాజా జాబితాలోకి మహారాష్ట్ర వేరియంట్‌ను జతచేస్తూ అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లలో ఇది నాలుగోదని వెల్లడించింది.


మళ్లీ మూడురకాలుగా మారి..
జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్‌ వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ నుంచి మే 11 వరకు దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్‌ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. ప్రస్తుతం డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ మళ్లీ మూడు రకాలుగా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతోంది. ఇందులో మొదటి రకం 34 దేశాల్లో, రెండో రకం 31 దేశాల్లో ప్రభావవంతంగా ఉండగా... మూడో రకం అతి తక్కువగా 4 దేశాల్లో కనిపించినట్లు చెబుతోంది.

ఈ వైరస్‌ను తొలుత గత అక్టోబర్‌లోనే గుర్తించినప్పటికీ క్రమంగా మార్పు చెందుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఏప్రిల్‌ ఆఖరి వారం నుంచి ఈ నెల 11 నాటికి గుర్తించిన పాజిటివ్‌ కేసుల్లో మొదటి రకం వైరస్‌ 21 శాతం ప్రభావవంతంగా ఉంది. రెండో రకం వైరస్‌ 7 శాతం, మూడో రకం 5 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు పరిశీలన చెబుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో మొత్తంగా మహారాష్ట్ర వేరియంట్‌ 33 శాతం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే క్రమంగా ఇంటిల్లిపాదికి వేగంగా అంటుకోవడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.


దేశంలో వ్యాప్తికి కారణాలివే...
దేశంలో వైరస్‌ వ్యాప్తికి అజాగ్రత్తలు, నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో ప్రస్తావించింది. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల మాస్‌ మీటింగ్స్‌ పేరిట జనసమూహాలు విచ్చలవిడిగా జరిగాయి. వీటితోపాటు ఎన్నికలు లేని ఒకట్రెండు రాష్ట్రాల్లో మతపరమైన సమూహాలు పెద్ద ఎత్తున చేరడం లాంటివి చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తిపై హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. చాలామంది జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. లాక్‌డౌన్‌ అనంతరం అన్ని రంగాలు తెరుచుకుని సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న సమయంలో మాస్కుల వినియోగం సరిగా లేకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణంగా మారినట్లు చెప్పింది.


దూకుడుతో దాడి...
మహారాష్ట్ర వేరియంట్‌ సోకిన వారిలో ఆరోగ్యక్షీణత వేగంగా కనిపిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పరిశీలన చెబుతోంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఈ వైరస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. దీంతో ఆ రకం ప్లాస్మా థెరపీ కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రధానంగా యాన్జియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌2 (ఏసీఈ2)పై దాడి ప్రారంభిస్తుంది. శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి దూకుడుతో రంగంలోకి దిగుతున్న ఈ వైరస్‌ ఏసీఈ2 ఎక్కువగా ఉన్న ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. దీంతో ఈ వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా శ్వాససంబంధిత సమస్యలే ముందుగా వస్తున్నాయి.

ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతోంది. క్రమంగా దగ్గు రావడం, తీవ్రమైన జ్వరం రోజుల తరబడి ఉండడం, హైఫీవర్‌ రావడంలాంటి లక్షణాలకు కారణమవుతోంది. న్యుమోనియా వృద్ధి చెందడంతోపాటు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్‌ కడుపులోకి చేరిన వెంటనే డయేరియా మొదలవుతుంది. విపరీతమైన వాంతులు, విరేచనాలతో శరీరం డీహైడ్రేట్‌ అయ్యి క్రమంగా ఇతర అవయవాల పనితీరుపై పెనుభారం పడుతుంది.

వ్యాక్సిన్‌తో ఎదుర్కోవచ్చు
మహారాష్ట్ర వేరియంట్‌ ప్రమాదకారి అయినప్పటికీ వ్యాక్సిన్‌తో ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా కోవిడ్‌–19 బారిన పడ్డారు. అయితే ఇందులో 93 శాతం మందిలో ఊపిరితిత్తులపై ఈ రకం వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపలేదని మా పరిశీలనలో గుర్తించాం. అదేవిధంగా వ్యాక్సిన్‌ తీసుకోని 85 శాతం మందిలో సగం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ గుర్తించాం. అంటే మన టీకా పనితీరు ఇక్కడ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి లబ్ధిదారుడు స్లాట్‌ బుక్‌ చేసుకుని టీకా వేయించుకోవాలి.
–డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫేసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌
  

44 దేశాల్లో...
ప్రపంచ ఆరోగ్య సంస్థ జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్‌ వేరియంట్లను అంచనా వేస్తుంది. దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్‌ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 

దూకుడెక్కువ..
డబుల్‌ మ్యుటేషన్‌గా పేరొందిన మహారాష్ట్ర వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్‌ ఇప్పుడు విస్తృత ప్రభావాన్ని చూపుతోంది.

నంబర్‌ 4..
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లు ఇప్పటివరకు మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) ఉండగా, ఈ జాబితాలో నాలుగోదిగా మహారాష్ట్ర వేరియంట్‌ చేరింది.

ఇంటిల్లిపాదికీ..
ఇంట్లో ఒకరికి సోకితే ఇంటిల్లిపాదికీ వేగంగా అంటుకుంటోంది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి.. ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. 


 

మరిన్ని వార్తలు