120 మందికి.. ఒకే టాయిలెట్

26 Mar, 2023 13:45 IST|Sakshi

నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది.

సరిపోని గదులు
వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు.

సౌకర్యాలు కల్పించాలి 
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం.
– రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు

నివేదించాం
లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
– పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం  

మరిన్ని వార్తలు