7 నుంచి 10 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన

23 Jan, 2022 02:37 IST|Sakshi

7 నుంచి 10 తరగతులకు బోధన 

ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్య డైరెక్టర్‌ 

రొటేషన్‌ పద్ధతిలో 50 శాతం మంది సిబ్బంది హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బడులు తెరిచే వరకూ 7 నుంచి 10 తరగతులకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (24వ తేదీ) నుంచి ఆన్‌లైన్, దూర విద్య క్లాసులు నిర్వహించేందుకు అనుమతించారు. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 50 శాతం మంది రొటేషన్‌ పద్ధతిలో హాజరవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై స్కూల్‌ హెచ్‌ఎంలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  

31 నుంచి క్లాసులు మొదలుపెడదామనుకున్నా.. 
ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సం క్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో సెలవులను ఈ నెల 30 వరకూ పొడిగించింది. పరిస్థితి బాగుంటే 31 నుంచి క్లాసులు మొదలుపెట్టాలనుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేలో కోవిడ్‌ కేసులు, లక్షణాలున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాలల్లో శానిటైజేషన్‌ ప్రక్రియ అంతంతగానే ఉందని జిల్లా విద్యా శాఖ అధికారులు నివేదికలు పంపారు.

విద్యా సంస్థల్లో కోవిడ్‌ మొదలైతే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. స్కూళ్లు తెరిచినా విద్యార్థులను ధైర్యంగా పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని అధికారులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విద్యా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.   

మరిన్ని వార్తలు