ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం

28 Jul, 2020 08:34 IST|Sakshi

శిథిలావస్థకు చేరడంతో ఖాళీ చేయాలన్న ప్రభుత్వం  

ఇటీవల కురిసిన వర్షాలతోభవనంలోకి చేరిన నీరు 

సర్కారు ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు 

అఫ్జల్‌గంజ్‌: సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం పడింది. ఇన్నాళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాత భవనంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పుడేం జరుగుతుందోననే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు పాత భవనంలోకి నీరు చేరడంతో రోగులు,సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పాతభవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి పరిపాలనా విభాగం అధికారులు భవనాన్ని ఖాళీ చేసి సోమవారం తాళం వేశారు. పాత భవనంలోని పలు వార్డులను కులీకుతుబ్‌షా భవనంలోకి సర్దుబాటు చేశారు. పాతభవనంలోనే ఉన్న సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సింగ్‌ కళాశాలలోనికి మార్చారు.  

వెంటనే నూతన భవనం నిర్మించాలి.. 
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం వేయడంతో ఇక్కడి రోగులను ఇతర భవనాల్లోని వార్డుల్లోకి సర్దుబాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచాల కొరత ఏర్పడుతుండడంతో అవస్థలు పడుతుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని కోరారు. 

మరిన్ని వార్తలు