ఓయూకు దసరా సెలవులు.. ఉద్యోగులకు రెండు రోజులే

13 Oct, 2021 16:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీకి గురువారం(అక్టోబర్‌ 13) నుంచి ఈ నెల 19 వరకు ఆరు రోజులపాటు దసరా సెలవులను ప్రకటించారు. క్యాంపస్‌ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని పీఆర్వో డాక్టర్‌ సుజాత తెలిపారు. ఎగ్జామినేషన్‌ బ్రాంచ్, పాలన భవనం కార్యాలయం, ఇతర కార్యాలయాలకు 14, 15 తేదీలలో (రెండు రోజులు) మాత్రమే దసరా సెలవులు వర్తిస్తాయన్నారు. ఈ నెల 20 నుంచి తిరిగి ఓయూ తెరుచుకోనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.   

ఓయూలో ఈ–ఆఫీస్‌ సిస్టమ్‌ ప్రారంభం 
రాష్ట్ర ప్రభుత్వ కాలేజియోట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ చేతుల మీదుగా  ఈ– ఆఫీస్, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రారంభమయ్యాయి. మంగళవారం పాలన భవనంలో వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ–ఆఫీస్‌తో పనులు తొందరగా జరుగుతాయని, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగుల పూర్తి వివరాలతో పాటు వివిధ కార్యాలయాల సమాచారం అందుబాటులో ఉంటుందని పీఆర్వో డాక్టర్‌ సుజాత వివరించారు.  

18న ఓయూ పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు
సీపీజీఈటీ– 2021లో భాగంగా నిర్వహించిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. వాల్యూయేషన్ల జాప్యంతో పాటు దసరా సెలవుల కారణంగా ఫలితాలను 18కి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.  

ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల
ఓయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌ కోర్సుల  ఫస్టియర్‌ (సీబీఎస్సీ) మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ తెలిపారు. ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు. (చదవండి: నీట్‌ రద్దు.. మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ)

మరిన్ని వార్తలు