ఓయూ పీజీ కోర్సుల ఫీజు పెంపు

10 Nov, 2021 02:01 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల ఫీజులను పెంచింది. పదేళ్ల తరువాత పెంచిన ఈ  ఫీజులకు పాలక మండలి ఆమోదం లభించిందని, ఈ విద్యా సంవత్సరం(2021–22) నుంచి అమలు కానున్నాయని ఓయూ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెంచిన ఫీజుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఎంఏ(ఆర్ట్స్, సోషల్‌ సైన్సెస్‌) రెగ్యులర్‌ కోర్సులకు గతంలో ఏడాదికి రూ.2,800 ఉండగా ఈ సంవత్సరం నుంచి స్పెషల్‌ ఫీ, ట్యూషన్‌ ఫీజుతో కలిపి ఏడాదికి రూ.14 వేలకు పెంచారు.

సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులకు రూ.21 వేలు చేశారు. ఎమ్‌కాం రెగ్యులర్‌ కోర్సుకు రూ.30వేలు, సెల్ఫ్‌ఫైనాన్స్‌కు రూ.35 వేలు, ఎంసీజే రెగ్యులర్‌ కోర్సులకు రూ.20 వేలు, సెల్ప్‌ఫైనాన్స్‌కు రూ.30 వేలుగా నిర్ణయించారు. ఎమ్మెస్సీ (సైన్స్, మ్యాథ్స్, ఇతర) రెగ్యులర్‌ కోర్సులకు గతంలో రూ.3,800 ఉండగా ఈ ఏడాది నుంచి రూ.20,240 వరకు పెంచారు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ ఎమ్మెస్సీ కోర్సులకు రూ.35వేల వరకు చెల్లించాలి.

ఓయూ అనుబంధ ప్రవేటు కాలేజీల్లో సెల్ఫ్‌ఫైనాన్స్‌ ఎంఏ కోర్సులకు రూ.23,100, ఎమ్మెస్సీ కోర్సులకు రూ.33,000, ఎంఈడీ కోర్సుకు ఏడాదికి రూ.66 వేలు కాగా ఇప్పుడు రెండు సంవత్సరాలకు కలిపి రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు.  విద్యార్థులపై భారం పడకుండా, ప్రభుత్వం నుంచి లభించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనుకూలంగా ఫీజులు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు