కరోనా రోగులకు ఇక సహజ వాయువే! 

4 Jun, 2021 19:35 IST|Sakshi

కింగ్‌కోఠి ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

రెండు రోజుల్లో అందుబాటులోకి...  సహజ వాయువు నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి

నిమిషానికి 960 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవకాశం

హైదరాబాద్‌: లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అతి తక్కువగా వినియోగిస్తూ.. సహజ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను కోవిడ్‌ రోగుల కోసం వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా  ‘డిఫెన్స్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజషన్‌’(డీఆర్‌డీఓ) శాఖ వారు కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో  ప్రత్యేకంగా ‘ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది రోగులకు అందుబాటులోకి రానుంది.  

ఐదు దశల్లో ప్రాసెస్‌.. 
ఇక్కడ నిరి్మస్తున్న ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌లో ప్రధానంగా ఐదు దశలు..అంటే ఎయిర్‌ కంప్రెజర్, ఎయిర్‌ డ్రయ్యర్, ఎయిర్‌ ట్యాంక్, ఆక్సిజన్‌ జనరేటర్, ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంటాయి. తొలుత వాతావరణం నుంచి సహజంగా వస్తున్న వాయువును ఇందులోని ఎయిర్‌ కంప్రెజర్‌ తీసుకుంటుంది. తర్వాత ఆ వాయువును ఎయిర్‌ డ్రయ్యర్‌లోకి పంపుతుంది. అక్కడ నుంచి ఎయిర్‌ ట్యాంక్‌లోకి వెళ్తుంది. దీని నుంచి ఆక్సిజన్‌ జనరేటర్‌కు వెళ్లి ఆక్సిజన్‌ ట్యాంక్‌లోకి చేరుతుంది. ఇలా ఐదు దశల్లో  సహజ వాయువును ప్రాసెస్‌ చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్‌ను సాధారణ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు.  

లిక్విడ్‌ ఆక్సిజన్‌ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం ప్రస్తుతం కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో 13 వేల కిలోలీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది.  దీనిని నింపేందుకు ప్రతిరోజూ జడ్చర్ల నుంచి ఓ లారీ వస్తుంది.  లిక్విడ్‌ ఆక్సిజన్‌ను కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ జనరేటర్లను నిర్మించుకునేందుకు బడ్జెట్‌ కేటాయించింది. దీంతో డీఆర్‌డీఓ శాఖ ఈ ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్స్‌ తయారీని టాటా కంపెనీకి అప్పచెప్పింది.  

జనరేటర్‌ సమస్య వస్తే సిలిండర్లలోకి ఆక్సిజన్‌
ఇక్కడ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆక్సిజన్‌ జనరేటర్‌కు ఏదైనా టెక్నికల్‌ సమస్య వచ్చి ఉత్పత్తి ఆగిపోతే..అప్పటి వరకు ఉత్పత్తి అయిన ఆ ఆక్సిజన్‌ను 5, 10, 20, 30, 72 కేజీల సిలిండర్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు ఆక్సిజన్‌ జనరేటర్‌ అవసరం లేకుండా సహజంగా వచ్చే గాలిని కూడా సిలిండర్‌లలోకి ఆక్సిజన్‌గా మార్చేలా టాటా కంపెనీ వినూత్నమైన రీతిలో ప్రయోగాలు చేపడుతోంది. దీంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీరనుంది.  

రెండు రోజుల్లో అందుబాటులోకి  
గత వారం రోజులుగా ఇక్కడ ‘ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌’ పనులు జరుగుతున్నాయి. దాదాపు పని పూర్తి అయ్యింది. మరో రెండు రోజుల్లో సహజంగా తయారైన ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తాం. ఈ ప్లాంట్‌..సహజ సిద్ధమైన వాయువు నుంచి నుంచి నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎంతగానో ఉపయోగకరం. 
– డాక్టర్‌ రాజేంద్రనాధ్, కింగ్‌కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు