వనజీవి రామయ్యకు యాక్సిడెంట్‌.. ‘కేసు వద్దు.. మొక్కలు నాటించండి’

20 May, 2022 02:11 IST|Sakshi
వనజీవి రామయ్యను పరామర్శిస్తున్న మంత్రులు అజయ్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ నామా 

ప్రమాద కారకుడికి అదే శిక్ష

మంత్రులను కోరిన ‘వనజీవి’రామయ్య 

ఖమ్మం వైద్యవిభాగం: తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని బుధవారం రెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామయ్యను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రామయ్య పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. రామయ్యను పరామర్శించిన వారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు