పాలమూరు ధాన్యం.. పక్క రాష్ట్రాల్లో విక్రయం

20 Nov, 2021 04:02 IST|Sakshi

ధాన్యం అమ్మకాల్లో ఈసారి సీన్‌ రివర్స్‌

గతంలో పాలమూరులో కర్ణాటక రైతుల అమ్మకాలు

ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికెళ్తున్న అన్నదాతలు

కొనుగోలు కేంద్రాలు, ఇతరత్రా సమస్యలే కారణం 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎప్పుడైనా కర్ణాటక నుంచే రైతులు తాము పండించిన ధాన్యాన్ని పాలమూరుకు తీసుకొచ్చి విక్రయించే వారు. ఇది గతేడాది వానాకాలం, ఎండాకాలం సీజన్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారా యణపేట, జోగుళాంబ గద్వాలలో స్పష్టమైంది. ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారి బంధువులు, స్నేహితుల పేర్లతో అమ్మేవారు. సరిహద్దులో ఉండటం.. అక్కడి కంటే ఇక్కడే మద్దతు ధర ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

అయితే ఈ సారి సీన్‌ రివర్స్‌ అయింది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లో పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం సరిహద్దులు దాటి కర్ణాటకకు తరలు తోంది. పంట చేతికొచ్చినా సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. చేసినా కొర్రీలు, కోతలు భరించలేక జిల్లా రైతులు ఆ రాష్ట్రంలోని రాయచూర్‌కు తీసుకెళ్లి విక్రయిస్తు న్నారు. తెలంగాణలో ప్రభుత్వ మద్దతు ధర కంటే అటుఇటుగా రూ.200 తగ్గినా.. అక్కడే అమ్ముకు నేందుకు మొగ్గుచూపుతున్నారు.

పూర్తిగా అందుబాటులోకి రాని కేంద్రాలు..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారా యణపేట జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 7,10,993 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీనికను గుణంగా 822 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టు కోగా.. ఇప్పటివరకు 442 కేంద్రాలే అందుబాటు లోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో పంట చేతి కొచ్చినా కేంద్రాలు ప్రారంభం కాక.. ప్రారంభిం చినా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేక, గన్నీ బ్యాగులు, హమాలీల కొర తతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

దాదా పుగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కల్లాల్లో ఆర బోసిన తర్వాత నిల్వ చేసే అవకాశం లేక.. తుపాన్‌ సూచనలతో జిల్లా రైతులు దళారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు నారాయణ పేట జిల్లాలోని కృష్ణ, మాగనూర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్, కేటీదొడ్డి మండ లాలకు చెందిన అన్నదాతలు కర్ణాటకలోని రాయ చూర్‌కు ధాన్యాన్ని తరలించి విక్రయిస్తున్నారు. అక్కడ క్వింటాల్‌కు రూ.1,740 నుంచి రూ.1,800 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో దళారుల దోపిడీ..
ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకున్న దళారులు దోపిడీకి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతుల శ్రమను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకం క్వింటాల్‌కు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 కాగా.. దళారులు రూ.1,050 నుంచి రూ.1,400 లోపే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన కల్లాల వద్దకే వెళ్లి మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించిన తర్వాత వారు లారీల్లో రాయచూర్‌కు తరలించి విక్రయిస్తు న్నట్లు సమాచారం. కొందరు బడా ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం తాము కొన్న ధాన్యాన్ని నిల్వ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చి.. క్రయవిక్రయాలు ముమ్మరమైన తర్వాత వాటిని ప్రభుత్వ ధరకు అమ్మి సొమ్ముచేసుకునేలా వారు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

రాయచూర్‌లో రూ.1,740 ధర వచ్చింది 
నేను 35 ఎకరాల్లో వరి సాగు చేశా. 10 ఎకరాలు కోసి వారం రోజులైంది. 2రోజుల్లో మిగతా పొలం కోస్తా. కొనుగోలు కేం ద్రా ల్లో ఇంకా ధాన్యం కొంట లేరు. మంగళ వారం మండలానికి 7,500 గన్నీ బ్యాగులు వస్తే బడాబాబులు ఇద్దరికే ఇచ్చారు. మరో పక్క కొనుగోలు కేంద్రంలో 40 కేజీల బ్యాగుకు 3 నుంచి 6 కిలోల తరుగు తీస్తరు. దీంతో రాయచూరు మార్కెట్‌లో విక్రయించాం. క్వింటాల్‌కు రూ.1,740 ధర పలికింది. ఇక్కడి కంటే రూ.200 ధర తగ్గినా ట్రాన్స్‌పోర్టు, హమాలీలు అనే అవస్థ లేదు.– సంతోష్, రైతు, గూడెబల్లూర్, కృష్ణ, నారాయణపేట 

పరిస్థితి వేరేలా ఉండటంతో.. 
నేను వానాకాలంలో ఎకరంన్నర సాగు చేస్తే 32 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. మరోపక్క నాయకులు ఖరీఫ్‌ను పక్కనబెట్టి యాసంగి గురించే మాట్లాడు తున్నారు. దీంతో కర్ణాటకలోని రాయ చూరు మార్కెట్‌కు వడ్లను తరలించి అమ్ము కున్నాం. క్వింటాల్‌కు రూ.1,870 ధర వచ్చింది. – మహదేవ్, గట్టు, జోగుళాంబ గద్వాల 

మరిన్ని వార్తలు