21 నుంచి ‘పల్లెగోస– బీజేపీ భరోసా’ బైక్‌ ర్యాలీ

16 Jul, 2022 02:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ‘ప్రజాసంగ్రామయాత్ర’, పదిరో­జులు ‘పల్లె గోస– బీజేపీ భరోసా’పేరిట బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈవిధంగా పాదయా­త్ర, బైక్‌ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి ఒక క్రమపద్ధతిలో కొనసాగిస్తూ అసెంబ్లీ ఎన్నికల దాకా నిరంతరం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న బైక్‌ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా నియమించారు.

తొలివిడత బైక్‌ర్యాలీ ముగిసిన తర్వాత, ఆగస్టు 2 నుంచి సంజయ్‌ పాదయాత్ర–3 మొదలుకానుంది. ఇరవై రోజుల తర్వాత ఈ దశ పాదయాత్ర ముగియగానే రెండోవిడత బైక్‌ర్యాలీ... ఇలా వరసగా ఇవి సాగేటట్లు, వీటికి సమాంతరంగా పార్టీపరంగా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించేటట్లు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. సంజయ్,æ బైక్‌ర్యాలీలో పాల్గొంటున్న నేతలతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బైక్‌ర్యాలీ ప్రారంభకార్య­క్రమాల్లో సంజయ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు