కరోనా విషాదం: కోట్ల ఆస్తి ఉన్నా తీరని చివరి కోరిక

29 Apr, 2021 02:18 IST|Sakshi

సొంత వనంలో ఖననానికి ఒప్పుకోని గ్రామస్తులు

సాక్షి, పరకాల: వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన ఓ బంగారం వ్యాపారి (48) కరోనాతో వారం రోజులపాటు పోరాడి బుధవారం మృతి చెందాడు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన తాను మృతిచెందాక రేగొండ మండలం దమ్మన్నపేటలో ఉన్న ఎర్రచందనం వనంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు దమ్మన్నపేటకు చేరుకోగా, ఆ గ్రామస్తులు సరిహద్దులోనే అడ్డుకున్నారు.

కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు తమ గ్రామంలో నిర్వహించవద్దని తేల్చి చెప్పారు. గుంత తవ్వకానికి జేసీబీ డ్రైవర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో మళ్లీ మృతదేహాన్ని పరకాల శివారు చలివాగు ఒడ్డున ఉన్న శ్మశాన వాటికకు తీసుకొచ్చి దహనం చేశారు. మృతుడికి పరకాల పట్టణంలో మూడు చోట్ల రూ.కోట్ల విలువైన మూడంతస్తుల భవనాలతో పాటు, వ్యవసాయ మార్కెట్‌ ఎదురుగా రూ.కోటి విలువైన భవన సముదాయం ఉంది.   
(చదవండి: మాస్కు ధరించలేదని చిన్నారులతో కప్పగంతులు)

>
మరిన్ని వార్తలు