కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు

22 Nov, 2021 16:16 IST|Sakshi

12ఏళ్ల క్రితం తండ్రి.. ఇటీవల అనారోగ్యంతో తల్లి మృతి 

ప్రశ్నార్థకంగా మారిన పిల్లల చదువులు

కరోనా సమయంలో ఆశ వర్కర్‌గా విశేష సేవలందించిన తల్లి 

ఆదుకోవాలని కోరుతున్న బంధువులు, గ్రామస్తులు 

సాక్షి, మోటకొండూర్‌(నల్గొండ): మండలంలోని కొండాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు అనాథలుగా మారారు. దీంతో ఆ అమ్మాయిల భవిష్యత్‌ ప్రశ్నాకార్థంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే  ఆత్మకూరు(ఎం) మండలంలోని శీలంబాయి గ్రామానికి చెందిన కందడి సబిత– శ్రీనివాస్‌రెడ్డి దంపతుల్లో శ్రీనివాస్‌రెడ్డి 12ఏళ్ల కిందట మృతిచెందాడు.

దీంతో సబిత(39) 2006 నుంచి తన పుట్టిన ఇల్లు అయిన మోటకొండూరు మండలం కొండాపురంలోనే ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తుంది.  ఆమెకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతరు రేఖ డిగ్రీ తృతియ సంవత్సరం, హారిక ప్రథమ సంవత్సరం చుదువుతున్నారు. కరోనా సమయంలో గ్రామంలోని ప్రజలకు సబిత  విశేష సేవలందించి అందరి మన్ననలు పొందింది.

చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబంలో విషాదం)

నాలుగు నెలల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు అప్పటినుంచి ప్రైవేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. అప్పులు కూడా తీసుకుని వైద్యం చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈనెల 17న మృతిచెందింది.  దీంతో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మారారు. వీరకి కనీసం గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఏమీ లేదు.

ఆ ఆడబిడ్డలను చూసుకునేందుకు కేవలం 70 ఏళ్ల పైబడ్డ అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆ పిల్లల చదువు, పోషణ ఎలారా భగవంతుడా అంటూ అమ్మమ్మ ఎడుస్తూ ఉంటే ఆ గ్రామస్తుల హృదయాలు బరువెక్కాయి.  ఆ అమ్మమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లే, మగ బిడ్డలు ఎవరూ లేరు. రోడ్డున పడ్డ ఆ ఆడబిడ్డల భవిషత్య దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని  బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. 

చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు')

మరిన్ని వార్తలు