విఫల ప్రేమకు ఏటా కల్యాణం.. 18 ఏళ్లుగా ఇదే తంతు!

11 Apr, 2022 14:45 IST|Sakshi

సాక్షి, బయ్యారం: బలవన్మరణం పొందిన బిడ్డ జ్ఞాపకంగా గుడి కట్టి ఏటా శ్రీరామనవమి రోజు కుమారుడి విగ్రహానికి కల్యాణం చేయిస్తున్నారు.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాకు చెందిన భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా కొడుకు రాంకోటి ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 2003లో ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే కొడుకు రాంకోటి కలలోకి వచ్చి తనకు గుడి కట్టించి, వివాహం జరిపించాలని కోరినట్టు తల్లి సుక్కమ్మ కథనం. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలోనే గుడి కట్టించి.. అందులో కొడుకు విగ్రహంతోపాటు పెళ్లి కుమార్తె విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఆ విగ్రహాలకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు వివాహం జరిపించారు. 18 ఏళ్లుగా వారీ విధంగా చేస్తుండటం విశేషం. 

మరిన్ని వార్తలు