Gandhi Hospital: ఓపీకి వస్తే బీపీ తప్పదు

27 Sep, 2022 09:41 IST|Sakshi
గాంధీ ఓపీ విభాగంలో కంప్యూటర్‌ చిట్టీల కోసం బారులు తీరిన దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: గాంధీఆస్పత్రి అవుట్‌ పేషెంట్‌ విభాగానికి రోగులు పోటెత్తారు. నగర నలుమూలలతోపాటు పలు జిల్లాలకు చెందిన బాధితులు వైద్యసేవల కోసం సోమవారం పెద్దసంఖ్యలో తరలిరావడంతో కంప్యూటర్‌ చిట్టీలు మొదలుకొని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, చివరకు మందుల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఓపికి వస్తే బీపీ తప్పలేదని, ఉన్న రోగం వదిలించుకునేందుకు వస్తే కొత్తరోగాలు అంటుకుంటున్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు.

ఓపీ చిట్టీ కౌంటర్ల సంఖ్య పెంచాలనే నిర్ణయం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈవినింగ్‌ ఓపీ సేవలు ప్రారంభమైనప్పటికీ ఉదయం పూట వచ్చేందుకే రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మార్నింగ్‌ ఓపీకి రద్దీ పెరిగిందని ఆస్పత్రి అధికారి వ్యాఖ్యానించారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం సుమారు మూడున్నర వేల మందికి వైద్యసేవలు అందించారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు, వసతి సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు.  
చదవండి: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన..  వరద నీటిలో చిన్నారుల ఈత

>
మరిన్ని వార్తలు